Pakistan: ‘భారత్‌ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర చర్చ!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్‌ ముస్తఫా కమల్‌.. భారత్‌ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. భారత్‌ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్‌ (Pakistan) మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ పార్లమెంటు సాక్షిగా వారి దయనీయ స్థితిపై వాపోయారు. ఆయన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


‘‘టీవీలో చంద్రుడిపై భారత్‌ కాలుమోపినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు సెకన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాకిస్థాన్‌కు (Pakistan) కరాచీ ప్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారంలాంటిది. కానీ, 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు’’ అంటూ పాక్‌ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్‌ ముస్తఫా వివరించారు.

గత ఏడాది భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. మరోవైపు పాక్‌ (Pakistan) మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పూర్తిగా ఐఎంఎఫ్ సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.