ఏపీలో పోల్ పర్సంటేజ్.. కుస్తీలు పడుతున్న విశ్లేషకులు

ఏపీలో గెలుపెవరిదైనా మెజార్టీ స్వల్పంగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అయితే ఆ మెజార్టీ ఎవరికి వస్తుందనే విషయంలో మీడియా ఛానెళ్లు, విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానాలిస్తున్నారు.


మొత్తంగా అందరూ ఒక అంచనా దగ్గర మాత్రం ఆగిపోయారు. పోల్ పర్సంటేజ్ పెరిగితే ప్రతిపక్షానికి లాభం, గతంలో లాగే పోల్ పర్సంటేజ్ ఉన్నా, అంతకంటే తక్కువ ఉన్నా కూడా అది అధికార పార్టీకే లాభం అంటున్నారు.

ఏపీలో పోల్ పర్సంటేజ్ ఎంత..?

2014లో ఏపీలో పోలింగ్ శాతం 77.96

2019 ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ 79.64

ఈసారి పోలింగ్ శాతం అంతకంటే తక్కువ అని తేలిపోయింది. సోమవారం అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు ఉన్న సమాచారం మేరకు ఏపీలో 76.5 శాతం పోలింగ్ నమోదైంది. మహా అయితే మరో రెండు శాతం పెరగొచ్చని అంచనా. ఈ దశలో ప్రభుత్వంపై నెగెటివ్ ఓటింగ్ ప్రభావం పెద్దగా ఉండదని అంటున్నారు విశ్లేషకులు.

ఆ లెక్కలు వేరే ఉన్నాయా..?

ఈ ఏడాది ఓటరు జాబితాలో చాలా సవరణలు జరిగాయని, మరణాలు, డూప్లికేట్ లిస్ట్ పూర్తిగా తొలగించారని, అందుకే పోల్ పర్సంటేజ్ అనుకున్నదానికంటే కాస్త పెరిగినట్టు ఉందని మరో విశ్లేషణ వినపడుతోంది. అది కూడా నిజమైతే.. చివరి లెక్కలను మరింతగా సవరించాల్సి ఉంటుంది. అంటే పోల్ పర్సంటేజ్ పెరగడం కేవలం ఊహాజనితమే. ఓటరు పోటెత్తాడు, దండెత్తాడు అనే డైలాగులన్నీ అవాస్తవం. పోలింగ్ కి రిజల్ట్ కి ఈసారి ఎక్కువ గ్యాప్ ఉండటంతో టీవీల్లో కనపడే విశ్లేషకులను మరో 20రోజుల పాటు ప్రేక్షకులు భరించక తప్పదు.