Success story: ఒకప్పుడు ఇన్ఫోసిస్ లో ఆఫీస్ బాయ్..నేడు కోట్ల రూపాయల కంపెనీలకు ఓనర్.. ఇది

చిన్న ఉద్యోగి స్థాయి నుంచి కంపెనీలను ఏర్పాటు చేసేంత ఎదగటం అంటే అంత సులువు కాదు. ఈ మార్గంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే తపన ఉంటే, దృఢ సంకల్పంతో అంకితభవంతో పనిచేస్తే గమ్యాన్ని చేరుకోకుండా వారిని ఎవరూ ఆపలేరు.


ఈ విషయాన్ని మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాసి దాదాసాహెబ్ భగత్ నిరూపించారు. భగత్ ఒకప్పుడు ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో ప్యూన్‌గా పనిచేసేవాడు. అతిథులకు టీ, నీళ్లు అందించేవాడు. పూణెలో ఐటీఐ కోర్సు చేసిన తర్వాత నెలకు రూ.9వేలకు ఈ ఉద్యోగం చేశాడు భగత్. కానీ, పెద్దగా ఏదైనా చేయాలనే తన కలను నెరవేర్చుకోవాలనే ఆలోచనను మాత్రం వదులుకోలేదు. పగలు ప్యూన్‌గా పనిచేసిన తర్వాత రాత్రిపూట యానిమేషన్ నేర్చుకునేందుకు సెంటర్‌కి వెళ్లేవాడు. నేడు దాదాసాహెబ్ భగత్ నిన్త్‌మోషన్(Ninthmotion),డూగ్రాఫిక్స్( DooGraphics) అనే రెండు కంపెనీలకు యజమాని అయ్యాడు.

దాదాసాహెబ్ భగత్ 1994లో మహారాష్ట్రలోని బీడ్‌లో జన్మించారు. అతని కుటుంబం చెరుకు తోటల్లో కూలీ పనులు చేసేది. చిన్నతనంలో భగత్ కూడా పొలాల్లో కూడా పని చేయాల్సి వచ్చేది. స్వగ్రామంలో పదో తరగతి వరకు చదివిన భగత్.. ఆ తర్వాత ఐటీఐ చదువు పూర్తి చేసేందుకు పూణే వెళ్లాడు. ఐటీఐ చేసిన తర్వాత ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేశాడు.

ఎదగాలనే కోరిక

దాదాసాహెబ్ భగత్ ఇన్ఫోసిస్ లో ఆఫీస్ బాయ్‌గా ప్రతినెలా రూ.9,000 సంపాదించేవారు. ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. తాను కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పగలు పని చేస్తూ, రాత్రిపూట ఒక సెంటర్‌లో గ్రాఫిక్స్ డిజైనింగ్,యానిమేషన్ కోర్సు చేశాడు. కోర్సు పూర్తయ్యాక ముంబైలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో పాటు సి++, పైథాన్‌లో కోర్సు చేశారు.

ప్రమాదం జరిగినా

అనేక విజువల్ ఎఫెక్ట్‌లను రూపొందించడానికి చాలా సమయం పడుతుందని, పునర్వినియోగ టెంప్లేట్‌ల లైబ్రరీని సృష్టించడం అద్భుతంగా ఉంటుందని గ్రహించాడు. అలా డిజైన్ టెంప్లేట్‌లను ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత అతను ప్రమాదానికి గురయ్యాడు. దీంతో చాలా నెలలు మంచం మీద ఉండవలసి వచ్చింది. కానీ, భగత్ ధైర్యం కోల్పోలేదు. మంచం మీద కూర్చొని డిజైన్‌లు,టెంప్లేట్లు తయారు చేయడం కొనసాగించాడు. వీటిని అమ్మి ఉద్యోగంలో సంపాదించినదాని కంటే ఎక్కువ సంపాదించాడు. 2015లో నింత్‌మోషన్ అనే స్టార్టప్‌ని ప్రారంభించాడు. కొద్దికాలానికే, 6,000 మంది కస్టమర్‌లు అతనితో చేరారు.

లాక్‌డౌన్ సమయంలో

దాదాసాహెబ్ ఆన్‌లైన్ గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో పని చేస్తూనే ఉన్నారు. లాక్డౌన్ సమయంలో అతను గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. గ్రామంలోని గోశాలలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2020 సంవత్సరంలో, అతను కాన్వా మాదిరిగానే సులభమైన డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు.

దీనితో పాటు, అతను తన రెండవ కంపెనీ DooGraphics Pvt. లిమిటెడ్ ప్రారంభించారు. ఒకప్పుడు రూ.9వేలకు పనిచేసిన దాదాసాహెబ్ నేడు లక్షలు సంపాదిస్తున్నాడు. 26 సెప్టెంబర్ 2020న ప్రధాని మోదీ కూడా దాదాసాహెబ్ యొక్క పనిని,అంకితభావాన్ని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు.