ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు పోరుబాటకు దిగాయి. నిరసనల కార్యాచరణ ఖరారు చేసాయి. జీవో 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన జీవో 21లోనూ అసంబద్ధ నిర్ణయాలు ఉన్నాయని ఉపా ధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటిని తాము వ్యతిరేకించినా పాఠశాల విద్యాశాఖ ఏకపక్షంగా వాటిపై నిర్ణయం తీసుకుందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, పోరుబాట మొదలు పెట్టినట్లు సంఘాల నేతలు వెల్లడించారు.
నిరసనలకు పిలుపు ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. ఇటీవల హేతుబద్ధీకరణ జీవోలు జారీచేసిన నేపథ్యంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్వహించదలచిన సమావేశాన్ని గుర్తింపు పొందిన సంఘాలు మూకుమ్మడిగా బహిష్కరించాయి. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్-257, ఏపీటీఎఫ్-1938, పీఆర్టీయూ, ఏపీయూఎస్, ఆప్టా, వైఎస్ ఆర్టీఏ, పీహెచ్ఎంఏ సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి. నూతన సంస్కరణలకు నిరసనగా ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈవోల కార్యాలయాల ముట్టడి, 23న పాఠశాల విద్య డైరెక్టర్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆ తర్వాత మిగిలిన ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని వెళ్తూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తేల్చి చెప్పాయి.
గతంలో లాగానే ఇకపై చర్చలంటూ నిర్వహిస్తే కేవలం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలోనే జరగాలని స్పష్టంచేశాయి. ఇక నుంచి జరిగే చర్చలకు హాజరుకాబోమని ఆ సంఘాల నాయకులు స్పష్టంచేశారు. గత 30 వారాలుగా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నా, తాము లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలను విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వల్ల మూడు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయా రని, ఈ ప్రభుత్వం కూడా అవే విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఆరు రకాల బడుల విధానం అమలుచేస్తే, ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల బడుల విధానం ప్రవేశపెట్ట డం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమేనన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా చేయడం దారుణమని వాపోయారు.
సంఘ నేతల డిమాండ్లు ఇదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టం చేసాయి. ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించకూడదని డిమాండ్ చేస్తు న్నారు. ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి వారినే హెచ్ఎంలుగా నియమించాలని కోరారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలను, మైనర్ మీడియంలను కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఆ మేరకు పోస్టులు కేటాయించాలని కోరుతున్నారు. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులు దాటితే మూడో టీచర్ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.