గత రెండు మూడు రోజులుగా సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ మృతిని మరిచిపోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా పేరు గాంచిన కె.
మహేంద్ర (79) కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇక ఈ విషాదం మరిచిపోక ముందే ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన సంజయ్ కపూర్ (53) కన్నుమూశారు. ఇంగ్లాండ్లో పోలో మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది.
సంజయ్ ఆటాడుతున్న సమయంలో తేనెటీగ నోట్లోకి ప్రవేశిండంతో గుండెపోటు వచ్చి మరణించి ఉంటాడని, వైద్యులు తక్షణమే పరీక్షలు చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేక పోయారని పలు మీడియా సంస్థలు చెప్పుకొస్తున్నాయి. పోలో ఆడుతున్న సమయంలో ఆయనకి తెలియకుండానే తేనేటీగని మింగడంతో తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఊపిరాడలేదట. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. వైద్య సహాయం అందించే ప్రయత్నం చేసినప్పటికీ,ఆయనని బ్రతికించలేకపోయారని అంటున్నారు.
1990లలో బాలీవుడ్ను ఏలిన కరిష్మా కపూర్ 2003లో సంజయ్ కపూర్ను వివాహం చేసుకుని లండన్లో సెటిల్ అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2014లో వీరిద్దరు విడిపోగా, 2016లో అధికారికంగా డైవర్స్ తీసుకున్నారు. సంజయ్ కపూర్ ప్రియా సచ్దేవ్ను రెండో వివాహాం చేసుకున్నాడు.ఇక కరిష్మా కపూర్ అప్పటి నుండి సింగిల్గానే ఉంటుంది. సంజాయ్ కపూర్.. భారత ఆటోమోటివ్ రంగంలో కీలకమైన వ్యక్తి కాగా, ఆయన సోనా కామ్స్టార్ సంస్థకు ఛైర్మన్గా ఉన్నారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేశారు. అయితే సంజయ్ కపూర్ తన మరణానికి కొన్ని గంటల ముందు అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నివాళులు అర్పిస్తున్నారు.