Hyderabad: నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని ఎత్తుకెళ్లిపోయిన దొంగలు

కొన్ని దొంగతనాలను చూస్తే వీళ్లేం దొంగలురా బాబు అనిపిస్తుంది. ఏ గ్రహం నుంచి వచ్చార్రా బాబు అనక మానరు. అలాంటి దొంగతనమే వెలుగుచూసింది హైదరాబాద్‌లో. ఓ చక్కటి ఫ్యామిలీలో.. భర్తను మిగిల్చి… మిగతావారిని మాయం చేశారు. భార్యతో పాటు ఇద్దరు పిల్లల్ని చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిపోయారు. అదేంటీ.. దొంగలంటే డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీ చేస్తారు.. మనిషుల్ని ఎత్తుకుపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడ ఉంది అసలు మ్యాటర్. దొంగలు ఎత్తుకెళ్లింది భార్యాపిల్లల్నే..అయితే మనుషల్ని కాదండోయ్.. విగ్రహాలను. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. అందులోనూ.. ఆ విగ్రహాలు ఏదో ఫాపు నుంచో, ఇంటి నుంచో కాట్టేశారని అనుకోకండి.. రోడ్డు మీద GHMC ఏర్పాటు చేసిన విగ్రహాలను మాయం చేశారు.


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో GHMC .. 2021లో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఒక భర్త, ఓ భార్య.. వాళ్లకుఇద్దరు పిల్లలు ఉండగా.. వాళ్లు జాలీగా షాపింగ్ చేస్తున్నట్టుగా ఆ విగ్రహాలు ఏర్పాటు చేశారు. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండే ఆ విగ్రహాలు అందర్నీ ఆకర్షించేవి. చాలామంది ఆ స్పాట్‌లో ఫోటోలు తీసుకునేవారు. ఆ చక్కటి కుటుంబంపై ఎవరి కన్ను పడిందో ఏమో…. భార్య ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. భర్త విగ్రహాన్ని మాత్రం అక్కడే వదిలేశారు.

కాగా.. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. అంత పెద్ద విగ్రహాలను తీసుకెళ్తుంటే ఎవరూ చడలేదా సీసీ కెమెరాలు ఏమయ్యాయి అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. భర్తను వదిలేసి.. భార్య, కూతురు, కొడుకు కలిసి షాపింగ్‌కి వెళ్లారేమో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. విగ్రహాలను కూడా వదలరా.. మీ మొహాలు మండ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.