ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. గత కొన్నేళ్లుగా వైసీపీ ఎంపీగా, పార్లమెంటరీ పక్ష నేతగా ఉంటూ ఆ పార్టీలో నంబర్ టూ గా కూడా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. దీని వెనుక ఎలాంటి కారణం లేదన్నారు. ఈ నెల 25న తన రాజీనామా సమర్పిస్తానని ట్వీట్ చేశారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ సంచలనం రేపుతోంది. వరుసగా రెండోసారి ఎంపీగా కొనసాగుతున్న సాయిరెడ్డి తన పదవీకాలం పూర్తి కాక ముందే హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల 25న రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే తాను ఏ రాజకీయపార్టీ లోను చేరడం లేదని తెలిపారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదన్నారు.
ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తి గతం అని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎవరూ ప్రభావితం చేయలేదని కూడా సాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని సాయిరెడ్డి పేర్కొన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన వైఎస్ భారతికి సదా కృతజ్ఞుడిని అన్నారు. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు సాయిరెడ్డి తెలిపారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకు సైతం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీతో రాజకీయంగా విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నారు. తన భవిష్యత్తు వ్యవసాయం అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సాయిరెడ్డి ప్రకటించారు.