దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్ ట్రోఫీ టీమ్లో చోటు దక్కించుకున్నారు.