క్రిస్పీ పట్నం పకోడీలు.. టేస్ట్ చేశారంటే వదిలి పెట్టరు

www.mannamweb.com


సాయంత్రం అయ్యిందంటే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. వెరైటీగా తినాలి అనుకునే వారు ఖచ్చితంగా పట్నం పకోడీలు తయారు చేయండి.

పట్నం పకోడీలు తమిళుల వంటకం. పట్నం అంటే చెన్నై అని అర్థం. అప్పట్లో ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్లేందుకు తమిళులు ఈ పకోడీలు తయారు చేసుకుని తీసుకెళ్లేవారట. ఈ క్రమంగా పట్టణ ప్రయాణానికి తీసుకెళ్లే స్నాక్ కావడంతో పట్నం పకోడీ అని పేరు వచ్చింది. ఇవి సాధారణ పకోడీల కంటే ఎంతో రుచిగా క్రీస్పీగా ఉంటాయి. ఇవి ఒక రోజు అంతా నిల్వ ఉంటాయి. సాగినట్టుగా కూడా అవ్వవు. చాలా రుచిగా ఉంటాయి. ఎంతో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ పట్నం పకోడీలు ఎలా తయారు చేసుకుంటారు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పట్నం పకోడీలకు కావాల్సిన పదార్థాలు:

శనగ పిండి, పుట్నాల పప్పు, బియ్యం పిండి కొద్దిగా, సన్న రవ్వ కొద్దిగా, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సోంపు లేదా జీలకర్ర, జీడిపప్పు, నెయ్యి, బేకింగ్ సోడా, ఉప్పు, ఇంగువ, కారం, ఆయిల్.

పట్నం పకోడీలు తయారీ విధానం:

ముందుగా పిండి కలుపు కోవడానికి ఒక లోతైన గిన్నె తీసుకోవాలి. అందులో కొద్దిగా బేకింగ్ సోడా, నెయ్యి వేసి క్రీమీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సగం శనగ పిండి, సగం పుట్నాల పిండి, రెండు స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ సన్న రవ్వ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి బాగా కలిపిన తర్వాత.. నూనె తప్ప మిగతా పదార్థాలు అన్నీ వేసి బాగా కలపాలి. పిండి గట్టిగా ఉండాలి.

ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. నూనె వేడెక్కాక.. పిండిని ఉండలుగా చేసి ఆయిల్‌లో వేయాలి. అన్ని వైపులా ఎర్రగా వేగాక.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పట్నం పకోడీలు సిద్ధం. వీటిని పుదీనా చట్నీ, టమాటా చట్నీ, టమాటా కిచెప్‌తో తిన్నా రుచిగానే ఉంటాయి. చెన్నైలో ఇవి బాగా ఫేమస్.