పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో మ్యాచ్లో వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
హారిస్ రవూఫ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి సచిన్, సంగక్కరల రికార్డులను బ్రేక్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్ల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా కోహ్లీ 287 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక వన్డేల్లో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే 14 వేల కంటే ఎక్కువ పరుగులు చేయగా ఇప్పుడు కోహ్లీ మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 463 వన్డే మ్యాచ్ల్లో 44.8 సగటుతో 18,426 పరుగులను సచిన్ సాధించాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక రెండో స్థానంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర ఉన్నాడు. సంగక్కర 404 వన్డే మ్యాచ్ల్లో 42 సగటుతో 18, 048 పరుగులు చేశాడు. ఇందులో 25 శతకాలు, 93 అర్థశతకాలు ఉన్నాయి. ఇక కోహ్లీ 299 వన్డే మ్యాచ్ల్లో 57.8 సగటుతో 14000 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
వన్డేల్లో 14వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 18,426 పరుగులు
కుమార సంగక్కర (శ్రీలంక) – 14, 234 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) – 14,002* పరుగులు



































