హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్… ప్రస్తుతం గ్రేటర్లో రూ. 5కే మధ్యాహ్న బోభనం అందిస్తున్న అన్నపూర్ణ కేంద్రాల పేరు మార్చనున్నారు. అలాగే అందులో రూ.
5 కే మధ్యాహ్న భోజనం తరహాలోనే ఉదయం పూట అల్పహారం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా మధ్యాహ్నం సమయంలో రూ. 5 కే భోజనం అందిస్తూ పేదల కడుపు నింపుతున్నారు. అయితే అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం రోజున జరిగిన బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు. ఈ ప్రతిపాదనలో 11 శాశ్వత సీటింగ్ ప్రదేశాలలో ఉన్న నిర్మాణాల పునరుద్దరించడంతో పాటు… నూతన శైలిలో డివిజన్కు ఒకటిచొప్పున 150 ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇందిరా క్యాంటీన్లలలో రూ. 5కే బ్రేక్ ఫాస్ట్ను అందించనున్నారు.
అయితే ఇందిరా క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్గా ఏం అందించనున్నారనేది పూర్తి స్థాయిలో క్లారిటీ రావల్సి ఉంది. అయితే ఇడ్లీ, పొంగల్, ఉప్మా, పూరీ వంటి టిఫిన్స్లో ఏదో ఒకటి ప్రతిరోజూ అందించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
































