క్యాబ్ సర్వీసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైడ్ ధరల పెంపుకు ఆమోదం తెలిపింది. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో అనగా పీక్ అవర్స్లో క్యాబ్ కంపెనీలు ధరలను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
అలానే డైనమిక్ ప్రైసింగ్ (డిమాండ్ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు)కు కూడా అనుమతించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఆఫ్ పీక్.. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో బేస్ ఛార్జ్ కన్నా 50 శాతం తక్కువగా ఉండాలని.. అలానే పీక్ అవర్స్లో ఈ మొత్తాన్ని 200 శాతం వరకు అనగా రెట్టింపు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
అలానే 3కిలో మీటర్ల లోపు దూరానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని తెలిపింది. అలానే రాపిడో, ఓలా, ఉబర్ వంటి రైడ్ బుకింగ్ ప్లాట్ఫామ్స్.. ప్రైవేట్ మోటార్ సైకిల్స్ను వినియోగించుకునేందుకు అనగా బైక్ ట్యాక్సీలకు కేంద్రం పచ్చ జెండా ఊపింది.
కొత్త నిబంధనల ప్రకారం.. రైడ్ ఛార్జీలు పికప్ పాయింట్ నుంచి డ్రాప్ లోకేషన్ వరకు మాత్రమే వర్తించేలా ఉండాలి. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం సూచించింది. అలానే యాప్లో డ్రైవర్ రైడ్ అంగీకరించిన తర్వాత.. సరైన కారణం లేకుండా దాన్ని క్యాన్సిల్ చేస్తే.. రైడ్ ఛార్జీలో సుమారు 10 శాతం పెనాల్టీ విధిస్తారు. ఇది గరిష్టంగా 100 రూపాయలు ఉండనుంది. ఈ మొత్తాన్ని రైడ్ ప్లాట్పామ్, డ్రైవర్ మధ్యన సమానంగా షేర్ చేస్తారు. అలానే సరైన కారణం లేకుండా రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే.. ప్రయాణికుడికి కూడా ఇదే పెనాల్టీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
అలానే డ్రైవర్ల సంక్షేమం కోసం కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. రైడింగ్ ప్లాట్ఫామ్ ఓనర్లు.. తమతో జాయిన్ అయిన ప్రతి డ్రైవర్కు కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని కచ్చితంగా అందించాలని సూచించింది. అలానే కొత్త నిబంధనల ప్రకారం, ఆటో రిక్షాలు, బైక్ టాక్సీలు సహా వివిధ వర్గాల వాహనాలకు సంబంధించి బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ప్రస్తుతం ఇవి అధికారికంగా అగ్రిగేటర్ పాలసీ ఆయా యాప్స్ యాజమాన్యానం కింద ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రధాన నగరాలైన ఢిల్లీ,ముంబైలో ప్రస్తుత బేస్ ఛార్జీలు కిలోమీటరుకు రూ.20-రూ.21 వద్ద ఉండగా, పూణేలో ఇది కిలోమీటరుకు రూపాయలుగా ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం బేస్ ఛార్జీలను నిర్ణయించకపోతే.. అప్పుడు రైడింగ్ ప్లాట్ఫామ్స్ బేస్ ఛార్జీని నిర్ణయించుకోవచ్చు. కాకపోతే దీని గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే సమాచారం అందించాలని కేంద్రం వెల్లడించింది. మారిన నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.
































