ఆఫ్ఘనిస్తాన్లో మరో భారీ భూకంపం చోటుచేసుకుంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం…
నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 34 కిలోమీటర్ల (21 మైళ్ళు) దూరంలో భూకంప కేంద్రం ఉంది. అయితే తాజా భూకంపంతో ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది.
ఇక, ఆదివారం అర్దరాత్రి తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో పర్వత ప్రాంతాలలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. అయితే ప్రజలు నిద్రపోతున్నప్పుడు భూకంపం చోటుచేసుకోవడం… అది కూడా పర్వత ప్రాంతాలు కావడంతో చాలా ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే భూకంపం చోటుచేసుకున్న చోటు… మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. అయితే ఈ భారీ భూకంపం వల్ల ఇప్పటివరకు 1,400 మందికి పైగా మరణించారని, వేలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు.
భూకంపం వల్ల అత్యంత ప్రభావితమైన కునార్ ప్రావిన్స్లో 1,411 మంది మరణించారని, మరో 3,124 మంది గాయపడ్డారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. 5,000 కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.
































