నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం.. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏరోజుకారోజు చేసి ప్రత్యేకంగా నివేదించడం ఆనవాయితీ. విభిన్న అవతారాల్లో దర్శనమిచ్చే ఆ శక్తిస్వరూపిణికి ఇష్టమైన వంటకాలేంటో మనకు తెలుసు.. అయితే ఆ ప్రసాదాల్లో తక్షణ శక్తినిచ్చే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు కూడా ఉండడం విశేషం.
నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం.. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏరోజుకారోజు చేసి ప్రత్యేకంగా నివేదించడం ఆనవాయితీ. విభిన్న అవతారాల్లో దర్శనమిచ్చే ఆ శక్తిస్వరూపిణికి ఇష్టమైన వంటకాలేంటో మనకు తెలుసు.. అయితే ఆ ప్రసాదాల్లో తక్షణ శక్తినిచ్చే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు కూడా ఉండడం విశేషం. మరి అవేంటో తెలుసుకుందాం రండి..
పొంగలి
అమ్మవారికి ఇష్టమైన వంటకాల్లో పొంగలి నైవేద్యం కూడా ఒకటి. ఎలాంటి వయసు వారికైనా ఇట్టే అరిగే ఆహారం ఇది. అంతేకాదు.. దీనిని చేయడం కూడా సులభం.
⚛ బియ్యంలో శరీరానికి శక్తిని అందించే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెసర పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి బియ్యంతో కలిసి బ్యాలన్స్డ్ మీల్స్గా ఉపయోగపడతాయి. దీన్ని తినడం వల్ల అజీర్తి, కడుపుబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి.
⚛ పొంగలిలో వేసే మిరియాలు జీర్ణ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాల్ని శరీరానికి అందించడంలో ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయి. అలాగే దగ్గు, జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యలకి మిరియాలు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి.
దధ్యోజనం
అమ్మవారికి ఇష్టమైన వాటిలో దధ్యోజనం కూడా ఒకటి.. నవరాత్రుల్లో దీన్ని తప్పకుండా అమ్మవారికి నివేదిస్తుంటారు. ఇందులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా పోషకాలున్నాయి..
⚛ కడుపులో మంట, అజీర్తికి దధ్యోజనం మంచి మందులా పని చేస్తుంది. ఇది లోపల వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది. అలసట లేకుండా హాయిగా అనిపిస్తుంది.
⚛ పెరుగులో ప్రొబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్స్, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
⚛ దధ్యోజనం తక్కువగా తిన్నా సరే కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్చు అంటున్నారు నిపుణులు.
పులగం
పులగం తయారీలో ఉపయోగించే పెసరపప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బెల్లం, మిరియాలు, నెయ్యి లాంటివి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తాయి.
⚛ ఈ వంటకంలో కాపర్, ఐరన్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందిస్తాయి.
⚛ పెసరలో ఉండే క్యాల్షియం ఎముకల పటుత్వానికి ఉపయోగపడుతుంది.
⚛ ఉబ్బరంలాంటి సమస్యలు పులగం వల్ల తగ్గుతాయి. ఇది తేలికపాటి ఆహారం కావడం వల్ల శరీరం దీన్ని సులభంగా అరిగించుకోగలుగుతుంది.
పాయసం
⚛ పాయసంలో వాడే సగ్గుబియ్యం, సేమియా, కిస్మిస్.. మొదలైనవి శరీరానికి కావాల్సిన అదనపు శక్తినిస్తాయి. ద్రాక్ష, జీడిపప్పు, బాదం లాంటి ఎండు ఫలాలు రక్తహీనతని తగ్గిస్తాయి. శరీరానికి ప్రొటీన్లు కూడా అందిస్తాయి.
⚛ ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
⚛ రక్తంలోని అదనపు కొవ్వుల్ని నియంత్రించడంలో ఎండు ఫలాలు బాగా ఉపయోగపడతాయి.
బెల్లం పొంగలి
బెల్లం పొంగలంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పొంగలి కేవలం రుచిలోనే కాదు పోషకాల్లోనూ మిన్న!
⚛ బియ్యంలో కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన బలాన్నిస్తాయి.
⚛ బెల్లంలోని పోషకాలు జీర్ణవ్యవస్థకి కావాల్సిన ఎంజైముల్ని విడుదల చేసి, ఆహారాన్ని త్వరగా అరిగించడంలో సహాయపడతాయి.
































