భారీ ట్రాఫిక్​ జామ్.. 4 రోజుల పాటు వాహనాల్లోనే తిండి, నిద్ర.. 20 కి.మీ నిలిచిపోయిన వెహికల్స్

సాధారణంగా ఒక పది నిమిషాలు వాహనాలు కదలకుండా ట్రాఫిక్ జామ్ అయితే చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటింది 4 రోజుల నుంచి వాహనాలు ఒకే ప్లేస్‌లో ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవాలి.


అయితే బిహార్‌లోని ఢిల్లీ-కోల్‌కతా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత 4 రోజుల నుంచి ఎన్నో వాహనాలు ట్రాఫిక్ జామ్‌లోనే చిక్కుకునిపోయాయి. కేవలం 5కిలో మీటర్లు మాత్రమే వాహనాలు కదిలాయి. ఎక్కడ ఉన్న వాహనాలు అక్కడే ఉన్నాయి. డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల నుంచి ఆ వాహనాల్లోనే తిండి, నిద్ర చేస్తున్నారు. ఇంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినా కూడా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుండపోత వర్షాల కారణంగా..

బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఎన్​హెచ్​19లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో కేవలం నేషనల్ హైవే మీద మాత్రమే వాహనాలు వెళ్లడంతో ట్రాఫిక్ భారీగా పెరిగింది. కిలో మీటరు దూరం ప్రయాణించడానికి కూడా కొన్ని గంటల సమయం పడుతోంది. రోహ్‌తాస్ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు ఈ ట్రాఫిక్ జామ్ విస్తరించింది. దీంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల్లో కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే వాహనాలు కదులుతుున్నాయి. రోజుల తరబడి ట్రాఫిక్‌లో ఉండటంతో ఆకలి, నిద్ర, వాష్ రూమ్ వంటి వాటికి ఇబ్బంది పడుతున్నట్లు పలువురు తెలిపారు. వెంటనే అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.