ప్రస్తుతం 7వ వేతన సంఘం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగానే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, డీఏ వంటివి అమలు చేస్తుంటారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్, డియర్నెస్ రిలీఫ్ కూడా ఇదే నిర్ణయిస్తుంది. ప్రతి వేతన సంఘం కూడా పదేళ్ల పాటు కొనసాగుతోంది. తర్వాత కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుంది. అయితే ఈ ఏడాది చివరికల్లా.. 7వ వేతన సంఘం గడువు తీరుతుంది. దీంతో వచ్చే ఏడాది కొత్త వేతన సంఘం అమలు కావాల్సి ఉంటుంది. సాధారణంగానే కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్కు అనుగుణంగా జీతాలు భారీగా పెరుగుతుంటాయి.
ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైందని చెప్పొచ్చు. అయినప్పటికీ ఎప్పుడు అమల్లోకి వచ్చినా.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస వేతనం ఎంత ఉంటుందో అంచనా వేయొచ్చు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92- 2.08 గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేలుగా ఉండగా.. ఇది 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కింద కనీస వేతనం రూ. 34,560 కు చేరాల్సి ఉంటుంది. ఇక 2.08 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కింద ఇది రూ. 37,440 కు చేరుతుంది.
>> దీంతో ఇది అమల్లోకి వస్తే గనుక ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక మళ్లీ నెక్ట్స్.. 2026 జనవరి- జూన్ సమయానికి డీఏ పెంపు కూడా భారీగానే ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే.. సాధారణంగానే డీఏ 50 శాతం దాటితే .. 5వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా.. దీనిని బేసిక్ పే లో విలీనం చేయాల్సి ఉండేది. తర్వాత దీనిని అమలు చేయలేదు.
ఇప్పటికే డీఏ 58 శాతానికి చేరిన క్రమంలో.. 8వ వేతన సంఘం ఒకసారి అమల్లోకి రాగానే.. డీఏను అంటే 58 శాతం మొత్తాన్ని మినిమం బేసిక్ పేలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. చేతికి అందే వేతనం పెరుగుతుంది. ఇంకా.. డీఏ అప్పటినుంచి మళ్లీ సున్నా శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఉద్యోగ సంఘాలు డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటే గనుక.. డీఏ కచ్చితంగా సున్నా శాతం నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. కేంద్రం డీఏను ఏటా రెండు సార్లు సవరిస్తుంటుంది. జనవరి 1, జులై 1 నుంచి వీటిని అమలు చేయాలి. కానీ కొంత కాలంగా దీనిని మార్చిలో ఒకసారి, సెప్టెంబర్/అక్టోబరులో ఒకసారి ప్రకటించి.. బకాయిలతో కలిపి జనవరి, జులై ఒకటో తేదీల్లోని అమలు చేస్తూ వస్తోంది.
































