ఇండ్లలో మార్నింగ్ టైంలో వివిధ రకాల టిఫిన్స్ చేస్తుంటారు. ఇందులో ఇడ్లీ, దోసె, పూరీ, వడలు లాంటివి ఉంటాయి. వీటిల్లో బోండా కూడా ఒకటి. దీనిని చేయడానికి ఎక్కువగా మైదాపిండి, గోధుమపిండి వాడుతారు. అలా కాకుండా ఈసారి రాగి పిండితో బోండాలు చేశారంటే నూనె పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్గా, సాయంత్రం స్నాక్స్గా ఇవి బెస్ట్ ఆప్షన్. మరి ఆలస్యం చేయకుండా రాగి బోండాలు ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- గోధుమపిండి – 2 కప్పులు
- రాగి పిండి – 1 కప్పు
- బేకింగ్ సోడా – అర టీ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- అల్లం తరుగు – 1 టీ స్పూన్
- ఉల్లిపాయ – 2
- పచ్చిమిర్చి – 5
- కరివేపాకు – కొంచెం
- పెరుగు – 1 కప్పు
- జీలకర్ర – 1 టీ స్పూన్
-
తయారీ విధానం :
- ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి, రెండు కప్పుల గోధుమపిండి వేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి.
- అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ అల్లం తరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కప్పు పెరుగు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అనంతరం కొద్దికొద్దిగా వాటర్ పోస్తూ కలపాలి.
- ఆ తర్వాత పిండిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కనుంచాలి. అర గంట తర్వాత రెడీ చేసుకున్న పిండిని మరోసారి బాగా కలపాలి.
- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె కాగిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి చేతికి నీళ్ల తడి లేదా నూనె రాసుకుని పిండిని కొద్దిగా తీసుకుంటూ బోండాలుగా కడాయిలో వేసుకోవాలి.
- ఇలా కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బోండాలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఇలా ఫ్రై చేసుకున్న బోండాలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇక అంతే వేడివేడి రాగి పిండితో బోండాలు తయారైనట్లే!
- ఇలా ప్రిపేర్ చేసుకున్న వేడివేడి బోండాలను ప్లేట్లో తీసుకొని మీకు నచ్చిన చట్నీతో తింటే ఆహా అనాల్సిందే!
- ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ ఫుడ్గా అవుతుంది!



































