CEC impeachment notice: భారత రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పావులు కదుపుతున్నాయి.
CEC Gyanesh Kumar impeachment notice: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్తో ఇండియా కూటమికి చెందిన 193 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును సిద్ధం చేశారు. ఇందులో లోక్సభకు చెందిన 130 మంది, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులోని ఏదో ఒక సభలో ఈ నోటీసును సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక సీఈసీని తొలగించడానికి పార్లమెంటులో నోటీసు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి .
నిబంధనల ప్రకారం..
రాజ్యాంగం ప్రకారం, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుంది. లోక్సభలో కనీసం 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును ఇస్తేనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విపక్షాల వద్ద అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉండటంతో ఈ నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి పార్టీలతో పాటు, ప్రస్తుతం కూటమిలో అధికారికంగా లేని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా దీనిపై సంతకాలు చేశారు.
సీఈసీపై ఉన్న ఏడు ప్రధాన ఆరోపణలు
ఈ నోటీసులో జ్ఞానేష్ కుమార్పై మొత్తం ఏడు రకాల తీవ్రమైన ఆరోపణలను విపక్షాలు పొందుపరిచాయి. అందులో ప్రధానంగా అధికారంలో ఉండి పక్షపాతంగా వ్యవహరించడం, ఎన్నికల అవకతవకలపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు వంటి అంశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి.
రాజకీయ ఉత్కంఠ
పార్లమెంటులో ఈ నోటీసును సమర్పించిన తర్వాత, దానిని ఆమోదించాలా లేదా అనేది స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ నోటీసు ఆమోదం పొందితే, ఆరోపణల విచారణ కోసం ఒక కమిటీని వేయాల్సి ఉంటుంది. అయితే, అధికార పక్షానికి మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం నెగ్గడం కష్టమే అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై దేశవ్యాప్తంగా చర్చ లేవనెత్తడమే విపక్షాల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
సీఈసీని తొలగించే ఈ రాజ్యాంగ ప్రక్రియ ఇలా!
అభిశంసన నోటీసును ఆమోదిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , ఒక ప్రముఖ న్యాయకోవిదుడితో కూడిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఆరోపణలు నిజమని తేల్చి నివేదిక ఇస్తేనే, పార్లమెంటులో అసలు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో ఉభయ సభల్లోనూ ప్రత్యేక మెజారిటీ అంటే.. సభలోని మొత్తం సభ్యులలో సగానికి పైగా, ఓటింగ్ వేసిన వారిలో మూడింట రెండొంతుల మంది మద్దతు లభించాలి. ఒకే సెషన్లో రెండు సభలు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే, అప్పుడు రాష్ట్రపతి తుది ఉత్తర్వు జారీ చేయడం ద్వారా సీఈసీని పదవి నుంచి తొలగిస్తారు.

































