కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, వందేభారత్ రైళ్లు, విమానంలో ఉచిత ప్రయాణం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సౌకర్యాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు డీఏ పెంపు, వేతనంలో మార్పులు ఉంటాయి. అంతేకాకుండా రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది.


ఇప్పుడిక ప్రతిష్ఠాత్మక వందేభారత్ రైళ్లలో సైతం ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. ఇప్పటి వరకూ కుటుంబంతో సహా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఉద్యోగులకు కల్పించిన ప్రభుత్వం ఈ సేవల్ని విస్తరిస్తోంది. ఇకపై లగ్జరీ రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. లగ్జరీ రైళ్లంటే వందేభారత్, హమ్ సఫర్‌తో పాటు ప్రైవేట్ రైలు తేజస్‌లో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. అదే ఎల్‌టీసీ. దీని ప్రకారం వేతనంతో కూడిన సెలవుతో పాటు ప్రయాణ టికెట్లపై చేసిన ఖర్చుల్ని తిరిగి పొందవచ్చు. అంటే టికెట్ ఖర్చుల్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ప్రతి ఉద్యోగి నాలుగేళ్లలో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చు. ప్రయాణ ఖర్చులో కొంతభాగం ప్రభుత్వమే భరిస్తుంది.

ఇప్పటి వరకూ ఈ సదుపాయం లగ్జరీ రైళ్లకు ఉండేది కాదు. కేవలం ఎక్స్‌ప్రెస్ రైళ్లకే వర్తించేది. కానీ ఇకపై తేజస్, వందేభారత్, హమ్ సఫర్ రైళ్లలో కూడా ప్రయాణించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అంటే ప్రీమియం రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజధాని, శతాబ్ది రైళ్లకు ఇప్పటికే ఈ సౌకర్యం ఉంది.

ఎల్‌టీసీ ఇప్పటి వరకూ రైళ్లలో మాత్రమే ప్రయాణించేందుకు అవకాశముండేది. ఇకపై విమాన ప్రయాణం కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కశ్మీర్, లడఖ్, అండమాన్, నికోబార్ ప్రాంతాలకు వెళితే విమాన ప్రయాణంలో మినహాయింపు లభిస్తుంది.