సైఫ్ శరీరంపై ఆరు గాయాలు.. నటుడి హెల్త్ కండీషన్ పై డాక్టర్లు ఏమన్నారంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటనతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలోని బాంద్రా ఇంట్లోకి అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఓ దొంగ ప్రవేశించాడని..


అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడడంతో అతడిని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న దొంగ కోసం వెతుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. సైఫ్ అలీఖాన్‌ను వెంటనే లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారులు తెలిపారు.

“సైఫ్‌ను దొంగ కత్తితో దాడి చేశాడా.. ? లేదా అతడితో ఏమైనా గొడవ జరిగిన సమయంలో సైఫ్ గాయపడ్డాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మేము ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నాము. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది” అని సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సైఫ్ పర్సనల్ టీమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం సైఫ్ కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని.. ఈ ఘటనపై మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నామని.. ఇది పోలీసుల విషయం, మేము పరిస్థితిని మీకు తెలియజేస్తాము అని పేర్కోన్నారు.

అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్‌ని లీలావతి ఆసుపత్రికి తీసుకొచ్చారు . అతని శరీరంపై మొత్తం ఆరు గాయాలు ఉండగా వాటిలో రెండు లోతుగా ఉన్నాయి. అతని వెన్నెముక దగ్గర బలంగా గాయమైంది. ప్రస్తుతం ఆయనకు న్యూరోసర్జన్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్, అనస్థటిస్ట్ నిషా గాంధీ చికిత్స అందిస్తున్నారు. సైఫ్‌కు సర్జరీ చేసిన తర్వాతే మరింత సమాచారం అందించగలుగుతాం “అని లీలావతి హాస్పిటల్ సీఈవో నీరజ్ వివరించారు.

సైఫ్ అలీఖాన్ భవనంలోని సీసీటీవీలను, చుట్టుపక్కల భవనాల్లోని సీసీటీవీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఉద్దేశంతో దాడి చేశాడనే దానిపై పోలీసులకు ఇంకా సమాచారం అందలేదు. సైఫ్‌కి చికిత్స చేసిన తర్వాత అతడి నుంచి వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ ఘటనలో సైఫ్ భార్య కరీనా కపూర్, పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.