Kavya Maran: హైదరాబాద్‌ ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్‌

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడిపోవడంతో జట్టు యజమాని కావ్య మారన్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


చెన్నై: రెండు నెలలకు పైగా సాగిన ఐపీఎల్‌ (IPL) మెగా టోర్నీ ముగిసింది. ఫైనల్‌లో హైదరాబాద్‌ (Hyderabad) ఘోర ఓటమిని చవిచూసింది. కోల్‌కతా (Kolkata) 8 వికెట్ల తేడాతో నెగ్గి మూడోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌.. చివరిమెట్టుపై బోల్తా పడడంతో అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఇక వేలం పాట నుంచి మొదలు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటి ఉండే ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాని కావ్య మారన్‌ (Kavya Maran) మ్యాచ్‌ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జట్టు ఓడినా, గెలిచినా చప్పట్లతో మద్దతు తెలిపే తను.. ఫైనల్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ఓడడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే, కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్‌ అయింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో స్వల్ప స్కోర్‌కే సన్‌రైజర్స్‌ పరిమితం అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్‌ అయ్యర్‌ (52*), గుర్బాజ్‌ (39) చెలరేగడంతో 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్‌గా నిలిచింది.