మమ్మల్ని గర్వపడేలా చేశావు.. వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్‌ కాలేజ్‌ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఫైనాన్స్‌) పట్టా పుచ్చుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.


ఈ మేరకు గురువారం ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘వర్షమ్మకు అభినందనలు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని స్పందించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు.