MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? చట్టం ఏం చెబుతోంది.. పూర్తి వివరాలు ఇవి..

మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ధర ముందే నిర్ణయించి ఉంటుంది. దానినే మాగ్జిమమ్‌ రిటైల్‌ ప్రైస్‌(ఎంఆర్‌పీ) అని అంటారు. విక్రేత ఎవరైనా అంతకుమించిన ధరతో వస్తువులు విక్రయించకూడదు. అవసరమైతే ఆ ధర కన్నా తక్కువకు డిస్కౌంట్‌ ఇచ్చి విక్రయించుకోవచ్చు గానీ.. అంతకుమించి చేయకూడదు. ఇది కచ్చితమైన నిబంధన. అయితే ఇటీవల కాలంలో అసలు ఈ ఎంఆర్‌పీని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ దీనిపై కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఎంఆర్‌పీ అంటే ఏమిటి? దానిని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరైనా వ్యాపారి ఈ ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తే ఏం చేయాలి? ఫిర్యాదులు చేయాలంటే ఎక్కడ చేయాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఎంఆర్‌పీ అంటే..
మ్యాగ్జిమమ్‌ రిటైల్‌ ప్రైస్‌(ఎంఆర్‌పీ) అనేది ఆ ఉత్పత్తి లేబుల్‌ లేదా ప్యాకేజింగ్‌పై ముద్రించి ఉంటుంది. ఎంఆర్‌పీలో ఉత్పత్తి ఖర్చులు, మార్కెటింగ్‌ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టు ఖర‍్చులు, ఉత్పత్తిదారులు, విక్రేతల లాభాల మార్జిన్‌ కలిపి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ ఉత్పత్తి తయారీదారుడు లేదా విక్రేతలు ఎంఆర్‌పీ ధరలను నిర్ణయిస్తారు. ఇది ఆ ఉత్పత్తిపై వినియోగదారు నుంచి రిటైలర్‌ చట్టబద్ధంగా వసూలు చేయగల అత్యధిక మొత్తాన్ని ఈ ఎంఆర్‌పీ సూచిస్తుంది.

ఎంఆర్‌పీ అవసరమా?
ఎంఆర్‌పీ అనేది అధిక ధరలను వసూలు చేసే రిటైలర్ల నుంచి కస్టమర్ అయిన మీకు రక్షణ కల్పిస్తుంది. ఇది గందరగోళం, దోపిడీని నివారించడానికి బెంచ్‌మార్క్ ధరను ఏర్పాటు చేస్తుంది.

చట్టం ఏం చెబుతోంది..
మన దేశంలో 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్యాక్ చేసి ఉన్న వస్తువుల విక్రయాన్ని నియంత్రిస్తుంది. దీని ప్రకారం ఉత్పత్తి లేబుల్‌లు లేదా ప్యాకేజింగ్‌పై ఎంఆర్‌పీని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఆ లేబుల్‌పై ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు ఉత్పత్తులను విక్రయిస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. దీనికి జరిమానాలతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రతి ప్యాక్‌పై వస్తువు నికర పరిమాణం, ఎంఆర్‌పీ, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.

ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే..
దుకాణదారుడు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులను విక్రయిస్తే వినియోగదారులు దుకాణం నిర్వహించే సంబంధిత రాష్ట్రంలోని లీగల్ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు.
వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ని 1800-11-4000/ 1915లో సంప్రదించవచ్చు లేదా వారి సంబంధిత జిల్లాల్లోని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
8800001915కు ఎస్‌ఎంఎస్‌ చేయవచ్చు. ఎన్‌సీహెచ్‌ యాప్‌, ఉమాంగ్‌ యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చు.వినియోగదారులు ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదును కూడా ఫైల్ చేయవచ్చు.
ఫిర్యాదు చేయడానికి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. రిజిస్ట్రేషన్ కోసం వెబ్ పోర్టల్ కి వెళ్లి లాగిన్ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై అవసరమైన వివరాలను తెలియజేస్తూ సైన్ అప్ చేయండి, మీ ఈ-మెయిల్ ద్వారా ధ్రువీకరించండి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ సృష్టించుకోవాల్సి ఉంటుంది.
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ద్వారా వినియోగదారులు సంతృప్తికర సమాధానం రాకపోతే అప్పుడు వినియోగదారుల కమిషన్‌ వద్ద అప్పీలుకు వెళ్లవచ్చు. అందుకోసం ఎన్‌సీఆర్‌డీసీ వెబ్‌ సైట్లోకి వెళ్లాలి. దానిలో రాష్ట్ర కమిషన్, జిల్లా కమిషన్ ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే దుకాణదారునికి జరిమానా విధించబడవచ్చు. వినియోగదారుడు అధికంగా వసూలు చేసిన మొత్తానికి పరిహారం పొందేందుకు అర్హులు.
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎంఆర్‌పీ అనే ఏదైనా ఉత్పత్తిపై గరిష్ట ధర. అంతేకాని అది ఫిక్స్‌డ్‌ ధర కాదు. రిటైలర్లు వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు లేదా ప్రమోషన్లను అందించవచ్చు. అలాంటి సమయంలో ఎంఆర్‌పీ కన్నా తక్కువగా విక్రయాలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *